అనగనగా 'మానసపుర' అనే మృగ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఉగ్రుడు అనే సింహం రాజు. ఆ రాజు దగ్గర జంబుక అనే నక్క మంత్రిగా ఉండేది. జంబుక మహా జిత్తులమారి. ఎలాగైనా సింహాన్ని మాయం చేసి, తానే ఆ మానసపుర రాజ్యానికి రాజు కావాలని దానికి గూఢమైన కోరిక ఉండేది.
అదే రాజ్యంలో చరక అనే ఒక తెలివైన కుందేలు తన పరివారంతో కలిసి నివసిస్తూ ఉండేది.
ఒకరోజు ఉదయం చరక తన కుటుంబంతో కలిసి పచ్చటి గడ్డిని మేయడానికి బయటకు వచ్చింది. అది గమనించిన జంబుకకు ఒక దురాలోచన వచ్చింది. జంతువులన్నింటినీ భయపెట్టి తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంది. వెంటనే గట్టిగా అరుస్తూ—
"చరకా! జాగ్రత్త! అటువైపు నుంచి మహారాజుగారు వస్తున్నారు. వెంటనే పారిపోండి!" అని అబద్ధం చెప్పింది.
రాజు పేరు వినగానే భయపడిన కుందేళ్లు ప్రాణాలు దక్కించుకోవడానికి వేగంగా పొదల్లోకి దూరి దాక్కున్నాయి. అది చూసి జంబుక మురిసిపోతూ, క్రూరంగా నవ్వుకుంది.
"ఈ రాజ్యానికి కాబోయే రాజును నేనే! నాకంటే బలవంతుడైన సింహాన్ని వాడుకుని నేనే అందరినీ శాసిస్తున్నాను. ఈ జంతువులకు నా పేరు చెప్తేనే వణకాలి!" అని మనసులో అనుకుంది.
ఆ తర్వాత జంబుక ఉపాయంతో రాజును వేటాడకుండా చేసి, తనే స్వయంగా జంతువుల నుంచి పన్నుల రూపంలో ఆహారాన్ని వసూలు చేయడం మొదలుపెట్టింది. సింహాన్ని గుహకే పరిమితం చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ అడవిలోని జంతువులన్నీ జంబుకను చూసి భయపడటం మొదలుపెట్టాయి.
అధికారం చేతికి వచ్చేసరికి జంబుకకు బద్ధకం, అహంకారం పెరిగిపోయాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న జంబుక అహంకారాన్ని, బద్ధకాన్ని తెలివైన చరక (కుందేలు) గమనిస్తూనే ఉంది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.
అది కడు వేసవి కాలం. అడవి అంతా ఎండిపోయి ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి ప్రమాదవశాత్తూ ఎండుగడ్డికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో అడవి అంతా వ్యాపించసాగాయి.
ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించిన చరక, తన పరివారంతో కలిసి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయడం ప్రారంభించింది. దారిలో సోమరిగా పడుకుని ఉన్న జంబుకను చూసి చరక గట్టిగా హెచ్చరించింది:
"మంత్రిగారూ! అడవి తగలబడిపోతోంది, వెంటనే పారిపోండి!"
కానీ, అహంకారంతో ఉన్న జంబుక కళ్ళు తెరవలేదు.
"ఈ కుందేళ్లు ఎప్పుడూ ఇంతే... పిరికివి! ఏదో చిన్న పొగ చూసి భయపడిపోతున్నాయి. కాబోయే రాజును, నన్నే బెదిరిస్తాయా?" అని నిర్లక్ష్యంగా నవ్వి, అక్కడే ఉన్న ఒక పెద్ద పొద చాటుకు వెళ్లి మళ్లీ పడుకుంది.
కానీ చూస్తూ చూస్తూనే మంటలు అడవిని చుట్టుముట్టాయి. జంబుక పడుకున్న పొదకు కూడా నిప్పు అంటుకుంది. బద్ధకంతో, అతివిశ్వాసంతో ఉన్న జంబుక తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. చరక తన సమయస్ఫూర్తితో, హెచ్చరికలను గమనించడం వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది.
నీతి :
మన చుట్టూ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ గమనిస్తూ, సమయస్ఫూర్తితో జీవించాలి. అతివిశ్వాసం, బద్ధకం మరియు నిర్లక్ష్యం మనిషిని (లేదా జంతువునైనా) నాశనం చేస్తాయి.
వెల్మజాల నర్సింహ.
12.06.26
19.07.25