ఊరికో చరిత్ర!


 ఊరంటే పాత గోడలు, వయసైపోయిన వృద్ధులే కాదు

ఆత్మాభిమానం గల అమ్మానాన్నలు ఉంటారు

ఊపిరికి - ఊరుకు విడదీయలేని అవినాభావ సంబంధం

మాటల్లో చెప్పలేం, రాయాలంటే ప్రతి ఊరికో చరిత్ర!




నర్సింహ వెల్మజాల ✍🏻31.08.26

లందె గొల్లం!



మాదిగలు తోలును నానబెట్టడం కోసం కుమ్మరివారిచే ప్రత్యేకంగా ఒక తొట్టిని తయారు చేయించేవారు. తోలును శుభ్రం చేయడానికి తంగెడు చెక్కను (తంగెడు చెట్టు బెరడును) వేరు చేసి, నీళ్లతో నింపే ఆ పెద్ద తొట్టినే ‘లందె గొల్లం’ అని పిలుచుకుంటారు. ఇది మన పూర్వీకుల జీవనోపాధిలో ఒక భాగం.


ఈ ‘లందె గొల్లం’ గురించి బ్రహ్మాండ పురాణం, రేణుకా-ఎల్లమ్మ చరిత్ర, పరశురాముడి పురాణ ఘట్టాలు మరియు జానపద కథల్లో విరివిగా ప్రాచుర్యంలో ఉన్న ఒక కథను స్మరించుకుందాం...


జమదగ్ని మహర్షి మరణం తర్వాత ఆయన కుమారుడైన పరశురాముడు, తన తండ్రిని చంపినవారు ఎవరో చెప్పమని తల్లి ఎల్లమ్మను అడుగుతాడు. అయితే, పరశురాముడికి ఇంకా సరైన వయస్సు రాలేదని భావించిన ఎల్లమ్మ తల్లి ఆ విషయాన్ని చెప్పడానికి నిరాకరిస్తుంది. దాంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు తల్లిని బాధించడం మొదలుపెడతాడు.


ఆ సమయంలో అమ్మవారు తనను తాను కాపాడుకోవడానికి పారిపోతూ, మార్గమధ్యంలో వివిధ కులాల వారి ఇళ్లలో మరియు వారి వృత్తి స్థలాల్లో దాక్కుంటుంది. ఆ క్రమంలోనే ఎల్లమ్మ తల్లి చివరికి మాదిగల 'లందె'లో కూడా దాక్కుంటుంది

బంధువు ఎవ్వడు !


మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు; అది ధర్మం, కర్మ, మానవ మనస్తత్వం మరియు జీవిత సత్యాల మహాసాగరం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి, శ్రీకృష్ణునికి నడుమ జరిగిన సంవాదం భగవద్గీత రూపంలో మనకు జీవన మార్గదర్శిగా నిలిచింది. నిత్య జీవితంలో ఎదురయ్యే సందేహాలకు, అనుబంధాల మోహానికి భగవద్గీత స్పష్టమైన పరిష్కారాన్ని చూపుతుంది.

యుద్ధరంగానికి వచ్చి నిలబడిన అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసి తీవ్ర మోహంలో, మానసిక కుంగుబాటులో పడిపోతాడు.

"ఎదురుగా ఉన్నవారంతా నా తాతలు, గురువులు, అన్నదమ్ములు, నన్ను ప్రాణసమానంగా ప్రేమించిన బంధువులే కదా! వీరిని చంపి పొందే రాజ్య భోగాలు నాకెందుకు కృష్ణా! "


ఇది కేవలం అర్జునుడి ప్రశ్న మాత్రమే కాదు; బంధాలు, అనుబంధాల వల్ల ధర్మం వైపు నిలబడటానికి వెనుకాడే ప్రతి సాధారణ మానవుడి మానసిక స్థితికి ప్రతీక. రక్తసంబంధాలు ధర్మానికి అడ్డుగా నిలిచినప్పుడు మానవుడు కర్తవ్య విమూఢుడవుతాడని అర్జునుడి పాత్ర ద్వారా వ్యాస మహర్షి స్పష్టం చేశారు.


అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణపరమాత్మ అతని మోహాన్ని పటాపంచలు చేస్తూ ధర్మాన్ని ప్రబోధిస్తాడు:


"వారు నీ బంధువులే కావచ్చు. కానీ వారి స్థానం ఎక్కడుందో చూడు! అధర్మం వైపు నిలబడి వారు నీకు ఎదురుగా శత్రువులుగా ఉన్నారు. నీ ధర్మానికి, శ్రేయస్సుకు వారు అండగా ఉండాలి కానీ, అధర్మానికి కొమ్ముకాస్తూ నీకు ఎదురుగా నిలబడ్డారంటే వారు నీ బంధువులు కారు, ధర్మ విరోధులు మాత్రమే!"


కేవలం రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన లేదా ఒకే కులంలో, కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఎవరూ బంధువులు కాజాలరు. మన శ్రేయస్సును కోరేవాడు, ధర్మ మార్గంలో నడిచేవాడే అసలైన బంధువు అని పరమాత్మ నొక్కిచెప్పాడు.


మహాభారత కాలం నాటి ఈ సంవాదం నేటి ఆధునిక సమాజానికి కూడా పరిపూర్ణంగా వర్తిస్తుంది. నేడు సమాజంలో కనిపిస్తున్న అనేక అనుబంధాలు "అవసరాల బంధుత్వాలు"గానే మిగిలిపోతున్నాయి. సిరిసంపదలు, అధికారాలు, పదవులు ఉన్నంతవరకే పలకరించే బంధువులు కష్టకాలం రాగానే ముఖం చాటేస్తారు. స్వార్థం నెరవేరేంత వరకే ప్రేమానురాగాలు నటిస్తూ, అవసరం తీరిపోగానే దూరం జరిగే బంధాలు నిజమైనవి కావు.


మన కష్టాల్లో, నష్టాల్లో భాగస్వాములై, మన ఎదుగుదలను చూసి ఆనందిస్తూ, ధర్మం తప్పినప్పుడు హెచ్చరించి సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన బంధువులు. అటువంటి గుణం లేనివారు ఎంతటి రక్తసంబంధీకులైనా శత్రువులతో సమానం.


"బంధువు ఎవ్వడు?" అనే ప్రశ్నకు సమాధానం కేవలం రక్తసంబంధంలో లేదు, అది భావంలో, ధర్మంలో ఉంది. రూపుదిద్దుకున్న బంధాల కంటే గుణంతో, నిశ్చలమైన ప్రేమతో ఏర్పడే అనుబంధాలే శాశ్వతమైనవి. అధర్మాన్ని విడనాడి, సత్యం మరియు కర్మ మార్గంలో మనకు తోడుగా నిలిచే ప్రతి శ్రేయోభిలాషీ మనకు నిజమైన బంధువే. ఈ సత్యాన్ని గ్రహించి జీవించడమే మానవ జీవితానికి సార్థకత.



వెల్మజాల నర్సింహ.29.07.26

దుప్పల్లి!

దుప్పల్లి!

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని దుప్పల్లి గ్రామానికి ఎంతో ఘనమైన, వైభవోపేతమైన చరిత్ర ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన చారిత్రక ఆధారాలు ఈ ఊరి ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. ఈ గ్రామ చరిత్ర విశేషాలు ఇక్కడ పొందుపరచడమైనది:


కాకతీయుల కాలం నాటి వైభవం – పురాతన ఆధారాలు

కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని కాలంలో దుప్పల్లి ప్రాంతం అత్యంత వైభవోపేతంగా విలసిల్లిందని ఇక్కడి శిథిలమైన రాతి శిల్పాలు, కట్టడాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఏనుగుల సైన్యం ఉండేదనడానికి గుర్తుగా, వాటిని కట్టేసే భారీ రాతి స్తంభాలు, నిర్మాణాల శిథిలాలు గ్రామంలో అక్కడక్కడా నేటికీ దర్శనమిస్తాయి.


దుప్పల్లి పొరుగున ఉన్న రామన్నపాడు పొలాల్లో రైతులు దుక్కి దున్నే సమయంలో సగం విరిగిన పురాతన విగ్రహాలు, మట్టి కుండలు, ఆనాటి రాజుల కాలంలో చెలామణిలో ఉన్న నాణేలు బయటపడటం ఇక్కడి చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనం.

ఒకప్పుడు ఈ ప్రాంతం కేవలం చిన్న గ్రామంగా కాకుండా, ఒక పెద్ద నగరంగా విస్తరించి ఉండేదనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. నాటి నగర సరిహద్దులు తక్కలపాడు నుండి రామన్నపాడు మరియు సింగరపాడు వరకు వ్యాపించి ఉండేవని స్థానికులు నమ్ముతారు. మూసీ నది వెంబడి 'బాచ్చ్ పాల్' గ్రామం వరకు ఎన్నో రాతి విగ్రహాలు శిథిలమై పడి ఉన్నాయి. అయితే, అంతటి వైభవంగా ఉన్న ఆనాటి నగరం రూపురేఖలు మారి, ప్రస్తుత దుప్పల్లి గ్రామంగా ఏ పరిస్థితుల్లో, ఎప్పుడు రూపాంతరం చెందిందనే విషయానికి సంబంధించిన స్పష్టమైన లిఖితపూర్వక ఆధారాలు (అక్షర రూపం) లభ్యం కాలేదు.


మూసీ నది మధ్యలో ఒక భారీ రాతి బండపై నిర్మించిన గంగమ్మ తల్లి దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ, ఇంజనీరింగ్ అద్భుతం.

కాశ్మీర విగ్రహాలు: నది ఒడ్డున పురాతనమైన 'కాశ్మీర' శైలిని పోలిన అనేక విగ్రహాలు ఉన్నాయి, ఇవి నాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.

 వ్యవసాయ బావినే ఆలయంగా మార్చి, అందులోని దైవాన్ని పూజించే విశిష్టమైన సంప్రదాయం బహుశా దుప్పల్లి గ్రామానికి మాత్రమే సొంతం.

ఎల్లమ్మ దేవి జాతర: ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే ఎల్లమ్మ దేవి జాతర చరిత్ర కూడా దురదృష్టవశాత్తు ఎక్కడా గ్రంథస్థం కాలేదు. గ్రామ సరిహద్దుల్లోని వందల ఏళ్ల నాటి వేప చెట్లు ఎన్నో తరాల పండుగ సంబరాలకు, సాంస్కృతిక వైభవానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.


మూసీ నదికి అడ్డు కట్ట వేసి కాలువలు గా మార్చి చెరువుల నిర్మాణం చేసి బీడు భూములను వ్యవసాయ భూములుగా 

మార్చారు వెనుకటనే..

విద్యా రంగంలో అగ్రగామి

దొరల (జమీందారుల) కాలంలో కూడా ఈ ఊరి చరిత్రను వివరించే 'సావనీర్' (జ్ఞాపికలు) లేదా రికార్డులు పెద్దగా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల కంటే ముందే దుప్పల్లికి పదవ తరగతి వరకు పాఠశాల రావడం ఈ ఊరి విద్యా చైతన్యానికి నిదర్శనం. ఆనాటి మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో వసంతాలు గడిచినా, ప్రతి సంవత్సరం పాఠశాల విద్య పూర్తి చేసుకుని వెళ్లే పదవ తరగతి పిల్లలు.. కన్నతల్లిని వదిలి వెళ్తున్నంతటి భావోద్వేగానికి గురికావడం ఇక్కడి గురు-శిష్యుల బంధానికి, ఊరితో ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది.

భవిష్యత్తు తరాలకు అందించాల్సిన వారసత్వం

ఇంతటి ఘనచరిత్ర కలిగిన దుప్పల్లి గ్రామ పంచాయతీ రికార్డులలో ఈ వివరాలకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉన్నాయో లేదో శోధించాల్సి ఉంది. ఈ చారిత్రక విషయాలన్నింటినీ సేకరించి, ఒక సమగ్రమైన "గ్రామ చరిత్ర పుస్తకం" రూపంలో తీసుకువస్తే, అది ఇప్పటి తరం యువతకు మరియు రాబోయే తరాలకు మన ఊరి గొప్పదనాన్ని తెలియజేసే అద్భుతమైన కానుక అవుతుంది.


నర్సింహ వెల్మజాల✍🏻

వాన ముచ్చట్లు !

 నిన్ననే ఈదురు గాలులతో

 వచ్చిన వరుణుడు

అటు పట్నం పోలేదు 

ఇటు ఊళ్ళలో లేడు

బొడ్డు రాయికి

 మా ఆడపడుచులు చెప్పి

 వస్తుండ్రు

జర ఇక్కడే కొన్నాళ్ళు

 ఉండాలని

రైతన్నలతో ముచ్చటించాలని. 


వెల్మజాల నర్సింహ ✍🏻

జంబుక - చరక !(కథ)



అనగనగా 'మానసపుర' అనే మృగ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఉగ్రుడు అనే సింహం రాజు. ఆ రాజు దగ్గర జంబుక అనే నక్క మంత్రిగా ఉండేది. జంబుక మహా జిత్తులమారి. ఎలాగైనా సింహాన్ని మాయం చేసి, తానే ఆ మానసపుర రాజ్యానికి రాజు కావాలని దానికి గూఢమైన కోరిక ఉండేది.


అదే రాజ్యంలో చరక అనే ఒక తెలివైన కుందేలు తన పరివారంతో కలిసి నివసిస్తూ ఉండేది.


ఒకరోజు ఉదయం చరక తన కుటుంబంతో కలిసి పచ్చటి గడ్డిని మేయడానికి బయటకు వచ్చింది. అది గమనించిన జంబుకకు ఒక దురాలోచన వచ్చింది. జంతువులన్నింటినీ భయపెట్టి తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంది. వెంటనే గట్టిగా అరుస్తూ—

"చరకా! జాగ్రత్త! అటువైపు నుంచి మహారాజుగారు వస్తున్నారు. వెంటనే పారిపోండి!" అని అబద్ధం చెప్పింది.

రాజు పేరు వినగానే భయపడిన కుందేళ్లు ప్రాణాలు దక్కించుకోవడానికి వేగంగా పొదల్లోకి దూరి దాక్కున్నాయి. అది చూసి జంబుక మురిసిపోతూ, క్రూరంగా నవ్వుకుంది.

"ఈ రాజ్యానికి కాబోయే రాజును నేనే! నాకంటే బలవంతుడైన సింహాన్ని వాడుకుని నేనే అందరినీ శాసిస్తున్నాను. ఈ జంతువులకు నా పేరు చెప్తేనే వణకాలి!" అని మనసులో అనుకుంది.


ఆ తర్వాత జంబుక ఉపాయంతో రాజును వేటాడకుండా చేసి, తనే స్వయంగా జంతువుల నుంచి పన్నుల రూపంలో ఆహారాన్ని వసూలు చేయడం మొదలుపెట్టింది. సింహాన్ని గుహకే పరిమితం చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ అడవిలోని జంతువులన్నీ జంబుకను చూసి భయపడటం మొదలుపెట్టాయి.

అధికారం చేతికి వచ్చేసరికి జంబుకకు బద్ధకం, అహంకారం పెరిగిపోయాయి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేసింది. రోజురోజుకూ పెరిగిపోతున్న జంబుక అహంకారాన్ని, బద్ధకాన్ని తెలివైన చరక (కుందేలు) గమనిస్తూనే ఉంది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.

అది కడు వేసవి కాలం. అడవి అంతా ఎండిపోయి ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చి ప్రమాదవశాత్తూ ఎండుగడ్డికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు క్షణాల్లో అడవి అంతా వ్యాపించసాగాయి.

ఆ ప్రమాదాన్ని ముందుగానే గమనించిన చరక, తన పరివారంతో కలిసి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయడం ప్రారంభించింది. దారిలో సోమరిగా పడుకుని ఉన్న జంబుకను చూసి చరక గట్టిగా హెచ్చరించింది:

"మంత్రిగారూ! అడవి తగలబడిపోతోంది, వెంటనే పారిపోండి!"


కానీ, అహంకారంతో ఉన్న జంబుక కళ్ళు తెరవలేదు.

"ఈ కుందేళ్లు ఎప్పుడూ ఇంతే... పిరికివి! ఏదో చిన్న పొగ చూసి భయపడిపోతున్నాయి. కాబోయే రాజును, నన్నే బెదిరిస్తాయా?" అని నిర్లక్ష్యంగా నవ్వి, అక్కడే ఉన్న ఒక పెద్ద పొద చాటుకు వెళ్లి మళ్లీ పడుకుంది.


కానీ చూస్తూ చూస్తూనే మంటలు అడవిని చుట్టుముట్టాయి. జంబుక పడుకున్న పొదకు కూడా నిప్పు అంటుకుంది. బద్ధకంతో, అతివిశ్వాసంతో ఉన్న జంబుక తప్పించుకునే లోపే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. చరక తన సమయస్ఫూర్తితో, హెచ్చరికలను గమనించడం వల్ల తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది.

నీతి :

మన చుట్టూ ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ గమనిస్తూ, సమయస్ఫూర్తితో జీవించాలి. అతివిశ్వాసం, బద్ధకం మరియు నిర్లక్ష్యం మనిషిని (లేదా జంతువునైనా) నాశనం చేస్తాయి. 


వెల్మజాల నర్సింహ.

కాలగమనంలో..

 




రోహిణి కార్తె కొంచెం కోపంగానే ఉండే,
జనాలు విన్నరుగా... మొక్కలు నాటారు!
భూతల్లి పగిలిన చర్మంతో, వేయి కళ్ళ ఇంద్రుడిని తలపిస్తోంది.
మొక్కలు గుక్కెడు నీళ్లు లేక మాడిపోయాయి,
చెరువులన్నీ ఎండిపోయి నీళ్లే కరువయ్యాయి.
గొడ్డు గోదా కాంక్రీటు రోడ్లపై సంచరిస్తుంటే,
ఈ కలియుగంలో పిడికెడంత పిట్ట ప్రాణం ఎంత?
ఇప్పుడైనా కొంచెం ఉపశమనం కోసం,
కాలం చాపకింద నీరులా జారుకుంటోంది...
వేసవి తాపం నుండి వర్షపు జల్లుల్లోకి!
కాలగమనంలో.. మరింత ముందుకు,
పిల్లలు బడికి పోవాలి, పక్షి పిల్లలు ఆకాశాన ఎగరాలి!

వెల్మజాల నర్సింహ ✍🏻12.06.26

జెండాలు - విగ్రహాలు .



డా. xxxx రెడ్డి మొన్ననే తెలుగు లెక్చరర్ అయ్యిండు మరియు డా. xxxxxxx రెడ్డి  సార్ ఈరోజు కలెక్టర్ గా పదోన్నతి పొందుతున్నారు 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు 

ప్రతి రోజూ వార్తలలో వారే! 

ఏ రిజర్వేషన్ లు నమ్ముకొని వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. లేదా వారి స్వయం కృషితోనే

సాధించారా మనం గమనించాలి.


భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి దాదాపుగా 

70వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాం 

రిజర్వేషన్లు వాడుకోని మనలో ఎంత మంది ఉన్నంత పదవులు పొందారు. ఎంత మంది ప్రభుత్వ కొలువులో ఉన్నారు.

ఎంత మందికి  గెజిటెడ్ ఉద్యోగాలువచ్చాయి. ప్రతి ఊరిలో ఒక వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెడితే మరికొందరు జ్యోతిరావు ఫూలే విగ్రహం పెట్టాలి అంటుంటారు. వేరే వారికి ఇవ్వేమి ఉండావి.

గణతంత్ర దినోత్సవం నాడు దండలేసి నినాదాలు 

చేసి మరిచి పోతాము. వారు చేసిన పోరాటా సమయం వేరు ఇప్పుడున్న కాలం వేరు వారు గొప్పవారే ,కానీ వారి ఆయుధం అక్షరం  నేడు మన ఆయుధం వారి వారసులం అంతే తేడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలు తిరిగి  ఉన్నంత చదువులు చదివారు. వారి సగం జీవితం చదువులకే  మనం వారి పేరు చెప్పుకొని వారు మనకే సొంతం అనుకుంటున్నాం.' అక్షర పితా' కావాల్సిన వారిని అంటరాని వారికి దేవుడిగా చేసుకున్నాం.


ఊర్లలలో  మంచికి  చెడుకు మనమే ముందుంటాం 

కానీ చదువులో వెనుక ఉంటాం జెండాలు మోసేది మనమే నాయకుడు అయ్యేది మరో వాడు.

మనలో మనం తన్నుకు చస్తాం వాడు పైనుంచి  ఆనందిస్తాడు. మనలో మనమే శత్రువులవుతం.  మన ఇరుగుపొరుగు వాళ్ళం విరోధం మూడో వాడికి ఆనందం.


తప్పు ఎక్కడ ఉంది జెండాలు మోయడం లోన 

విగ్రహాలు పూజించడం లోన మన ఐక్యత ఎక్కడా లోపిస్తుంది.మనం ఎందుకు ముందుకు పోలేక పోతున్నం రిజర్వేషన్లు ఉన్నాయానే సోమరి తనం 

వలన లేదా పూర్తిగా అంబేద్కర్ గారిని అర్థం చేసుకోనందున లేదా చుట్టూ ఉన్న సమాజం వలన 

ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఇప్పుటి తరానికి ఉంది.



వెల్మజాల నర్సింహ.22.01.26.